న్యూఢిల్లీ : పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడి ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనలను సోమవారం మరింత ఉద్ధృతం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా , ఆర్థికంగా అణగదొక్కుతున్నట్టు నిరసనకారులు తెలిపారు. 70 ఏళ్లకు పైగాపీవోకే లోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని , తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ “ షటర్ డౌన్…వీల్జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పీవోకే లోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్ల పైకి వచ్చారు.
ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది.