ఖాట్మండు : ఇటీవల నేపాల్లో జరిగిన జెన్జెడ్ ఆందోళనల నేపథ్యంలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం వీడి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఓలీ స్పందిస్తూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోనని అన్నారు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి తాను పారిపోతానని అనుకుంటున్నారా ? అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, దేశం లోనే ఉండి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని ఓలీ అన్నారు.
దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానన్నారు. సుశీలా కార్కి నేతృత్వంలోని పరిపాలనకు ఎటువంటి చట్టబద్ధత లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా …విధ్వంస శక్తుల ద్వారా అధికారం లోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికి కూడా తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయన్నారు.
నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతం లోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, అర్జు రాణా దేవుబా,రమేశ్ లేఖక్ సహా ఇతర నాయకుల పాస్పోర్టులను నిలిపివేయాలని తన నేతృత్వం లోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు.