చెన్నై : కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో కుట్ర కోణం ఉందని విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్తు బోర్డు స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతి పత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. అయితే అందుకు తాము అంగీకరించలేదని వెల్లడించారు.
సెప్టెంబర్ 27,2025 రాత్రి ఈ రోడ్డు లోని వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ , టీవీకే నుంచి లేఖ అందిందని, విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మిపేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని … విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరారన్నారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని తెలిపింది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.
అయితే ఘటన అనంతరం టీవీకే మాత్రం దీనిలో కుట్ర కోణం ఉందని ఆరోపించింది. తమ నేత విజయ్ ర్యాలీ వేదికకు చేరుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారని పేర్కొంది. దీంతో అభిమానులు ఆయనను చూసేందుకు ముందుకు కదిలారని, ఈ క్రమం లోనే తొక్కిసలాట జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్టు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.