దేశ సరిహద్దులలో జవానులు, దేశం లోపల పోలీసులు ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటారని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి హీరో హీరోయిన్లుగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం ‘కానిస్టేబుల్“ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం విశేషం. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ “నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఈ ఎమోషనల్ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది.
ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ ఈ పాటను ఆలపించి రక్తికట్టించారు. వరుణ్ సందేశ్కు ఇది కమ్బ్యాక్ చిత్రం కావాలి”అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “నేను ఇంతవరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. చక్కటి డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరింపజేస్తుంది”అని తెలిపారు. చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ “అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నైజాంలో ప్రముఖ సంస్థ ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. దాదాపు 500 థియేటర్ల పై చిలుకు థియేటర్స్లో ప్రంపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం”అని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ., “ట్రైలర్కి వస్తున్న స్పందన ఈ చిత్రంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి చిత్రాలు రావాలని అందరూ కోరుకునేవిధంగా ఈ చిత్రం ఉంటుంది‘’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హజరత్, సుభాష్ ఆనంద్, రామారావు, కుపేంద్ర పవార్, మిట్టపల్లి జగ్గయ్య, దువ్వాసి మోహన్, నిత్య, భవ్య, ఇందు పాల్గొన్నారు.