782 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టిజిపిఎస్సి
ఒక్క పోస్టుకు సంబంధించిన ఫలితాన్ని పెండింగ్లో పెట్టిన కమిషన్
దసరా పండుగలోపే నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది.2022 నోటిఫికేషన్కు సంబంధించిన గ్రూప్ -2 పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సి) ఆదివారం ప్రకటించింది. 783 పోస్టులకు గతేడాది నవంబర్లో టిజిపిఎస్సి పరీక్షలు నిర్వహించింది. 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. ఒక్క పోస్టుకు సంబంధించిన ఫలితాన్ని టిజిపిఎస్సి పెండింగ్లో పెట్టింది. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన రాత పరీక్షలకు సుమారు 2.5 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసిన కమిషన్, ఆ తర్వాత నాలుగు విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, వైద్య పరీక్షలు పూర్తి చేసింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, మెరిట్ ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించింది. ఈ పరీక్షల్లో 600 మార్కులకు గాను అత్యధికంగా 447.08 మార్కులు నమోదైనట్లు కమిషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సబ్- రిజిస్ట్రార్ గ్రేడ్ 2, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్- 3, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వంటి కీలక పోస్టులను భర్తీ అవుతాయి. ఎంపికైన వారికి దసరా పండుగకు ముందే నియామక పత్రాలు అందజేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
10 నెలల వ్యవధిలోనే తుది ఫలితాలు ఇచ్చాం : చైర్మన్ బుర్రా వెంకటేశం
గ్రూప్ 2 ఫలితాల విడుదలపై టిజిపిఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, పరీక్షలు నిర్వహించిన 10 నెలల వ్యవధిలోనే తుది ఫలితాలు ఇచ్చామని, గ్రూప్- 1 వివాదం లేకపోయి ఉంటే ఫలితాలు మరింత తొందరగా వచ్చేవని తెలిపారు.5,51,858 మంది దరఖాస్తు చేసుకోగా, 2,36,649 అర్హత సాధించగా, అందులో 782 మంది అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, కట్-ఆఫ్ మార్కుల వివరాలు కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్తో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ సూచించింది.
గ్రూప్ 2 టాపర్లు వీరే
పురుషులు..
నారు వెంకటహర్షవర్థన్
వడ్లకొండ సచిన్
మనోహర్ రామ్
శ్రీరాం మధు
చింతపల్లి ప్రీతంరెడ్డి
మహిళలు..
అక్కిరెడ్డి వినీషారెడ్డి
మైకాడి సుష్మిత
ఉప్పు శ్రీవేణి
వీరంరెడ్డి శ్రీలత
ఒట్టిముక్కల స్నేహ
………………………………………………………………