తెలంగాణ రాష్ట్రం పేదరికాన్ని తగ్గించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పేదరికంలో మగ్గిన ఎంతోమంది ఇప్పుడు మధ్యతరగతి జీవితానికి దగ్గరయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక విధానాలు, అవిశ్రాంత కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది. తెలంగాణ పేదరికం నిర్మూలనలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ‘నియో-మిడిల్ క్లాస్’ (పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతికి చేరువవుతున్న వర్గం)ను సృష్టించడంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ‘పేదరికం లేని సమాజం’ అనే లక్ష్యంలో తెలంగాణ 91 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న తమిళనాడుకు చేరువగా నిలిచింది. ఈ విజయం ప్రభుత్వ విధానాలు, సుస్థిర అభివగృద్ధి వల్ల ప్రజల జీవితాల్లో వస్తున్న నిజమైన మార్పును సూచిస్తోంది. భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. వేగవంతమైన వృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వేలాది మంది ప్రజలను పేదరికం నుంచి ’నియో-మిడిల్ క్లాస్’లోకి మార్చింది.
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ’పేదరికం లేని సమాజం’ లక్ష్యాన్ని చేరుకోవడంలో తెలంగాణ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2023- 24 సంవత్సరానికిగాను తెలంగాణ ఈ లక్ష్యంలో 91 పాయింట్లు సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచింది. కేవలం తమిళనాడు (92 పాయింట్లు) మాత్రమే తెలంగాణ కంటే ముందుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ 86 పాయింట్లతో తెలంగాణకు దగ్గరగా ఉంది. తెలంగాణ సాధించిన ఈ విజయం ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వృద్ధి నేరుగా ప్రజల జీవితాలపై చూపిస్తున్న ప్రభావాన్ని స్పష్టం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇటీవల తన ప్రసంగంలో నియో-మిడిల్ క్లాస్ వర్గాన్ని వారికి జీఎస్టీ రేట్ల తగ్గింపుల ద్వారా కలిగిన ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యాల ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించేవారిని తీవ్ర పేదలుగా పరిగణిస్తారు.
పేదరిక నిర్మూలనకు పలు పథకాలు : తెలంగాణలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పేదరిక నిర్మూలన మిషన్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడానికి తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనిచేస్తుంది. ఈ పథకాలు క్రెడిట్ యాక్సెస్, ఆర్థిక సహాయం అందించడం, అక్షరాస్యతను ప్రోత్సహించడం, జీవనోపాధి కల్పించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవల, తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి అనే కొత్త పథకాన్ని కూడా ప్రారంభించారు, ఇది అత్యంత వెనకబడిన కుటుంబాలకు సహాయం అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పేదరిక నిర్మూలన మిషన్ పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని తగ్గించడానికి, స్వయం-సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.
తెలంగాణలో గణనీయమైన పురోగతి : 2030 నాటికి తీవ్ర పేదరికాన్ని నిర్మూలించాలన్న ఐక్యరాజ్యసమితి లక్ష్యానికి తెలంగాణ సాధించిన ఈ విజయం ఎంతో ముఖ్యమైనది. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, సామాజిక సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం కూడా ఈ లక్ష్యాలలో ఒక భాగంగా చెప్పవచ్చు. నీతి ఆయోగ్ ఎస్డీజీ సూచీ రాష్ట్రాల పనితీరును అంచనా వేస్తుంది. ఈ సూచీలో ఆరోగ్య బీమా లేదా ప్రభుత్వ పథకాల ద్వారా ఆరోగ్య సేవలు పొందుతున్న కుటుంబాల సంఖ్య వంటి సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణలో 69 శాతం పైగా కుటుంబాలు ఆరోగ్య బీమా పరిధిలో ఉన్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇది గత కొన్నేళ్లలో పోలిస్తే గణనీయమైన పురోగతిని సాధించింది. 2020 -21లో తెలంగాణ 68 పాయింట్లతో 14వ స్థానంలో ఉండగా 2019- 20లో కేవలం 52 పాయింట్లతో అదే 14వ స్థానంలో నిలిచింది. కానీ ఐదేళ్లలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకోవటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సాధించిన విజయానికి నిదర్శనంగా నిలిచాయి.