ఇదిగో నరవణె పుస్తకం
2020లో జరిగిన భారత్ – చైనా ఘర్ష ణ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తన బాధ్యతలను విస్మరించారని, ఆ బాధ్యతను జనరల్ నరవణేకు అప్పగించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రాసిన విడుదలకాని జ్ఞాపకాలను ఉదహరిస్తూ ఈ ఆరోపణ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, మాజీ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన జ్ఞాపకాలులోని అంశాలను ప్రస్తావించి, ప్రభుత్వం మరో విధంగా చెబుతు న్నా, ఈ పుస్తకంలోని విషయాలను దేశంలోని యువకులు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
లోక్సభ స్పీకర్ కానీ, రక్షణమంత్రి రాజ్ నాథ్సింగ్ కానీ ఈ పుస్తకం చదవలేదని, ప్రభుత ్వం మాత్రం నరవణే వాదనకు భిన్నంగా ఆలాంటిది ఏమీ లేదని చెప్పిందని రాహుల్ అన్నారు. లడఖ్లో ఏమి జరిగిందో నరవణే పూర్తి కథనాన్ని రాశారని, దీనిని అంతా చదవాలని ఆయన అన్నారు. లోక్సభలో మాత్రం తాను ఈ జ్ఞాపకాలు నుంచి అంశాలను ప్రస్తావించ రాదని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు.
చైనా ట్యాంక్లు మన భూభాగంలోకి చొచ్చుకవస్తే.. ఏంచేయాలని జనరల్ ప్రశ్నించినప్పుడు ప్రధాని ఏది ఉచితమో అదే చేయండి అన్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కానీ, ఎస్, జైశంకర్, కానీ, ఎన్ ఎస్ ఏ అజిత్ డోవల్ కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని నరవణే పేర్కొన్న విషయాన్ని జ్ఞాపకాల నుంచి రాహుల్ ఉటంకించారు. చైనా దళాలు చొచ్చుకు వస్తే తమను అడగకుండా వారిపై కాల్పులు జరపవద్దు అని సైన్యానికి పై నుంచి స్టాండింగ్ ఆర్డర్ ఉందని నరవణే తెలిపారు. మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిన, చైనా ట్యాంకులపై తాను కాల్పులు జరపాలను కున్నట్లు మాజీ జనరల్ పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు.
ఆర్మీ చీఫ్ ఆ విపత్కర పరిస్థితిలో తాను ఒంటరిగా ఉన్నానని, బాధ్యతగల ప్రభుత్వం విడిచివేసిందని రాశారని పేర్కొంటూ, పార్లమెంటులో ఈ విషయం చెప్పేందుకు తాను సిద్ధపడినా, ఈవాస్తవాలు అంగీకరించేందుకు వారు భయపడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని పార్లమెంటుకు వస్తే .. తాను ఈ పుస్తకాన్ని ఆయనకు బహూకరిస్తానని, ఈ పుస్తకం ప్రతిపక్షనాయకుడు రాసింది కాదని, బాధ్యతాయుతమైన మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అని లోక్ సభలో ప్రతిపక్షనేత అన్నారు. చైనా సైన్యం మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ పై ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సివచ్చింది. నిర్ణయం తీసుకోవల్సిన ప్రధాని బాధ్యత నుంచి తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు . దేశం ఈ విషయాన్ని ప్రశ్నిస్తుంటే… ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా పారిపోతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆందోళన జరిపిన ప్రతిపక్షంలోని 8 మంది సభ్యులను లోక్సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.