ఐరాస కీలక సంస్థకు చైర్‌పర్సన్‌గా ప్రీతి శరణ్

న్యూయార్క్: సంక్లిష్టమైన బహుపాక్షిక సమస్యలను పరిష్కరించడంలో ఉన్న అనుభవం దృష్టా మాజీ దౌత్యవేత్త ప్రీతి శరణ్ ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి తాలూకు కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్(సిఈఎస్‌సిఆర్) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సిఈఎస్‌సిఆర్ అనేది ఐక్యరాజ్య సమితిలో కీలకమైన సంస్థ. ఇది సభ్య దేశాలు ఆర్థిక, సామాజిక హక్కులపై అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంది. ప్రీతి శరణ్‌కు ఇండియాలోనే కాక ఆసియా, ఆఫ్రికా, యూరొప్, అమెరికాలలో ఇండియన్ మిషన్స్ వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె వియత్నాంలో భారత రాయబారిగా, టొరొంటోలో కాన్సుల్ జనరల్‌గా పనిచేశారు. ఆమె ఇంకా మాస్కో, ఢాకా, కైరో, జెనీవాలోని భారత మిషన్లలో పనిచేశారు.