జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మాగంటి గోపినాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను వే దికపైకి ఆహ్వానించి కార్యకర్తలకు కేటీఆర్ పరిచయం చేసారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేసారు. జూబ్లీహిల్స్ లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడమే మాగంటి గోపినాథ్‌కు సరైన నివాళి అన్నారు.

Also Read: మీసేవ ద్వారా సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు

బీఆర్‌ఎస్ జైత్రయాత్ర తిరిగి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే ప్రారంభం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇలా ఉండగా వేదికపై నుంచి మాగంటి సునీత పార్టీ కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తూ, ఇంతకాలం మీరంతా గోపినాథ్‌కు ఏ విధంగా అండదండగా ఉన్నారో తనవెంట కూడా ఉండాలని విజ్ఞప్తి చేసారు. పార్టీ సమావేశానికి మాగంటి సునీత హాజరు కావడం ఇదే తొలిసారి . కాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఖరారు చేసిన విషయం తెలిసే ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన రావుల శ్రీధర్‌రెడ్డి, పువ్వాడ అజయ్ ఈ సమావేశానికి గైర్హాజర్ కాగా, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మాత్రం సమావేశానికి హాజరై పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలిపిస్తామని ప్రకటించడంవిశేషం.