ఓజోన్ అనేది ఆక్సిజన్ ప్రత్యేక రూపం. ఇది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన వాసన కలిగిన రంగులేని వాయువు. భూవాతావరణంలో స్ట్రాటోస్పియర్ పొరలో ఉండే ఓజోన్ వాయువు పొర అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమిపైగల సమస్త జీవరాశిని కాపాడుతుంది. అందుకే ఓజోన్ పొరను భూమి కవచం లేదా భూమి గొడుగు అంటారు. ఇది నీటిలోని సూక్ష్మక్రిములను చంపడానికి, గాలిని శుభ్రపరచడానికి, ఆహార పదార్థాల రంగును పోగొట్టడానికి, ఆహార నిల్వలలో బ్యాక్టీరియా పెరుగకుండా కూడా ఉపయోగపడుతుంది. ఈ పొర కనుక లేకుంటే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి సమస్త జీవులు నశించిపోతాయి. మొక్కలలో పలు రకాల తెగుళ్ళు కలుగుతాయి.
మానవునిలో చర్మరోగాలు, కంటి సమస్యలు, ఆస్తమా కాన్సర్ , శ్వాసకోశ వ్యాధులు, సంతాన సాఫల్యత తగ్గటంతోపాటు జీవవైవిధ్య నష్టం కలుగుతాయి.నానాటికీ పెరుగుతున్న మానవుడి పర్యావరణ విధ్వంసక చర్యలవల్ల కలిగే భూతాపంతో భూమి అగ్నిగోళంగా మారి ఓజోన్ పొర దెబ్బతింటున్నది. ఈ సమస్యలకు తోడు అంతరిక్ష ముప్పులు కూడా ఓజోన్ సంరక్షణకు కొత్త సవాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో భూమిపై సకల జీవుల సంరక్షణకు ఓజోన్ పొర పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలగురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కెనడాలో 16 సెప్టెంబర్ 1987న జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం జ్ఞాపకార్థం ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం (వరల్డ్ ఓజోన్ డే) ప్రతి సంవత్సరం 16 సెప్టెంబర్లో జరుపుకోవాలని 1994లో జరిగిన యుయన్ఒ సాధారణ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించబడింది. అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే నినాదంతో ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకొన్నాము. 2025లో జీవానికి ఓజోన్ (ఓజోన్ ఫర్ లైఫ్) అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాము.
నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఓజోన్ పొర సంరక్షణ, నిబద్ధత చర్యలను ఈ థీమ్ నొక్కి చెబుతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ నుండి గ్లోబల్ యాక్షన్ నినాదం ద్వారా శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్త కార్యాచరణగా మార్చడం వాతావరణమార్పులు ఓజోన్ క్షీణత- పర్యవసానాలు చెట్ల పెంపకం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. పారిశ్రామిక విప్లవం కారణంగా మానవుని స్వార్థపూరిత వికృత చర్యల వలన ఆధునిక జీవనశైలితో ప్రకృతి పర్యావరణం దెబ్బతినడం తీవ్రతరమైంది. ఎయిర్ కండిషన్స్, రిఫ్రిజిరేటర్ ప్లాస్టిక్ ఫోమ్స్ దోమలను నాశనం చేసే కాయిల్స్, జెట్ బిళ్ళల అపరిమిత వినియోగం, డిటర్జెంట్ల ఉత్పత్తుల వల్ల ఏర్పడే క్లోరోఫ్లోరో కార్బన్లు, క్లోరోఫ్లోరో మిథేన్, ఒలటైల్ ఆర్గానిక్ సమ్మేళనాలు, హలోకార్బన్లు, హైడ్రోకార్బన్లు ఏరోసాల్స్ పెస్టిసైడ్స్ ఓజోన్ పొరను ధ్వంసం చేస్తున్నాయి. అడవుల తగ్గింపు భూవినియోగంలో మార్పులు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు ఇ -వేస్టేజ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం రేడియేషన్ కాలుష్యం తదితరాలు భూమిని కలుషితం చేస్తున్నాయి. దీని కారణంగా ఓజోన్ దెబ్బతిని పలుచబడుతున్నది.1975లో మొట్టమొదటి సారిగా అంటార్టికా ప్రాంతంలో ఓజోన్ పొర క్షీణించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ సమస్యలకు తోడుగా అంతరిక్ష రాకెట్లలో ఉపయోగించే క్లోరిన్ అల్యూమినియం ఆక్సైడ్లు ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేస్తున్నాయి. వేల సంఖ్యలో తిరుగుతున్న ఉపగ్రహాలు రాకెట్ భాగాలు చివరికి అంతరిక్ష వ్యర్థాలుగా దహనం చెంది నైట్రస్ ఆక్సైడ్లు, క్లోరిన్లు విడుదలై ఓజోన్ను తగ్గిస్తున్నాయి. సూర్యుడి నుండి వచ్చే సోలార్ ఫ్లేర్స్ కాస్మిక్ కిరణాలు ఓజోన్ క్షీణతకు కారణమవుతున్నాయి. అంతరిక్ష పరిశోధనలో రాకెట్ల ఇంధనాల వల్ల ఉత్పత్తి అయ్యే గ్రీన్ హౌస్ వాయువులు ఓజోన్ పొరను బలహీన పరుస్తున్నట్లు పలు పర్యావరణ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ నివేదిక -21 ప్రకారం అంటార్టికా ప్రాంతంలో 1974 నుండి 2021 వరకు 75% ఓజోన్ పోర దెబ్బ తింటున్నట్లు అంచనా. ఓజోన్ పొరను దెబ్బ తీసే పదార్థాలతో పాటు ఫర్ ఎవర్ కెమికల్స్ వంటి పదార్థాలను నియంత్రించాలని తాజాగా 2024 జులై 8 12 తేదీలలో కెనడాలోని మాంట్రియల్లో జరిగిన 46వ పార్టిస్ టు ది మాంట్రియల్ ప్రోటోకాల్ ఓపెన్ ఎండెడ్ వర్కింగ్ గ్రూప్ సమావేశం పేర్కొనడం గమనార్హం. ఓజోన్ పొర రక్షణలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతగానో కృషి చేస్తున్నాయి.
2030 నాటికి అభివృద్ధి చెందిన దేశాలు, 2040 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలు వియన్నా కన్వెన్షన్ తీర్మానం -1985 అంశాలు అమలు పరచాలని నిర్ణయించాయి. క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించేందుకు 197 దేశాలు కుదుర్చుకొన్న మాంట్రియాల్ ప్రోటోకాల్- 1987 ఒప్పందం ప్రపంచంలో ఒక విజయవంతమైన పర్యావరణ ఒప్పందంగా గుర్తింపు పొందింది. కిగాలీ- 2016 సవరణ ఒప్పందంలో హైడ్రోఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించడం పర్యావరణ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రపంచ దేశాలు అమలు పరుస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాల వల్ల 2045 నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో, 2066 నాటికి అంటార్టికా ప్రాంతంలో ఓజోన్ పొర పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని యుఎన్ఒ పర్యావరణ కార్యక్రమం తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఓజోన్ సంరక్షణలో అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి అనేక పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టి అమలు పరుస్తున్నది. భారత ప్రభుత్వం ఓజోన్ డిప్లెషన్ నిరోధక ప్రోగ్రాంను అమలు చేస్తున్నది. అనేక ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ పథకాలను ప్రోత్సహిస్తున్నది. క్లోరో ఫ్లోరో కార్బన్లు, హలోన్స్ హెచ్సిఎఫ్ సి-14 బి, కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి పదార్థాల వియోగం నిలిపివేసింది. 2030 నాటికి హెచ్సిఎఫ్సి పూర్తిగా నిర్మూలన జరుగుతుందని అంచనా వేయబడింది. 2021లో మన దేశం కిగాలి సవరణకు ఆమోదం తెలిపింది. 2045 నాటికి హెచ్ఎఫ్సిల వినియోగాన్ని 85% తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తక్కువ శితలీకరణ అవసరాలు పర్యావరణ హిత సాంకేతికాలు సహజ రిఫ్రిజిరేటర్లను ప్రోత్సహించే దిశగా ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ను ప్రారంభించింది. సౌరశక్తితో నడిచే శీతలీకరణ పరికరాలపై పరిశోధనలు ముమ్మరం చేసి గ్రీన్ కూలింగ్ విప్లవాన్ని సృష్టించింది.శక్తిసామర్థ్యం ఎలెక్ట్రిక్ వాహనాలు గ్రీన్ హైడ్రోజన్ నెట్ జీరో- 2070లక్ష్యాలతో ఓజోన్ సంరక్షణను సమన్వయం చేసి వికసిత్ భారత్ దిశగా ముందుకు పయనిస్తుంది. ఓజోన్ సంరక్షణలో ప్రభుత్వాలతో పాటుగా పౌరసమాజం మరింత చిత్తశుద్ధితో కృషి చేయవలసిన అవసరం ఉంది. ఓజోన్ పొరను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనే తాత్విక చింతనతో సకల జీవరాశుల ప్రకాశవంతమైన భవిష్యత్ కోసం పర్యావరణ హిత హరిత జీవనం (గ్రీన్ లివింగ్) గడపటానికి మానవుడి ప్రవర్తనలో సానుకూల మార్పులు రావాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సురక్షితమైన భూమిని అందించగలం.
Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
భారత రవీందర్, 99125 36316