రైల్వే రిజర్వేషన్‌కు ఆధార్ లింక్

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ కోటా టికెట్లకు కూడా వర్తింపచేస్తున్నారు. ఒక ప్రయాణికుడు నవంబర్ 15న ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే,

నిబంధనల ప్రకారం 60 రోజుల ముందుగా, అంటే సెప్టెంబర్ 16న అర్ధరాత్రి 12. 20 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కొత్త నిబంధన ప్రకారం, 12. 20 నుంచి 12. 35 గంటల మధ్య, అంటే మొదటి 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ఐఆర్‌సిటిసి యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు. ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఆ సమయంలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ కీలకమైన సమయంలోనే టికెట్లకు అత్యధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి, నిజమైన ప్రయాణికులకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: కొడంగల్‌లో అంగన్‌వాడీల మెరుపు ధర్నా

పండగల సీజన్‌లో
దీపావళి, హోళి, ఛాఠ్ పూజ వంటి ప్రధాన పండగల సమయంలో, పెళ్లిళ్ల సీజన్‌లో రైలు టికెట్లకు పోటీ తీవ్రంగా ఉంటుంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయిపోతాయి. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు, ఏజెంట్లు మోసపూరిత పద్ధతుల్లో టికెట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త ఆధార్ ఆధారిత నిబంధనతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని రైల్వే బోర్డు భావిస్తోంది. దీనివల్ల సాధారణ, నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పటికే గత జూలై నుంచి తత్కాల్ బుకింగ్‌కు ఈ విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు జనరల్ కోటాకు కూడా దీనిని వర్తింపచేస్తున్నారు.

ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, అక్టోబర్ 1లోగా తమ ఐఆర్‌సిటిసి యూజర్ ఐడీకి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. సాధారణంగా రైలు టికెట్ల జనరల్ రిజర్వేషన్ విండో ప్రతిరోజూ అర్ధరాత్రి 12. 20 గంటల నుంచి రాత్రి 11. 45 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త రూల్స్ కేవలం మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రయాణికులకు మరింత సురక్షితమైన, న్యాయమైన టికెటింగ్ ప్రక్రియను అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు చెబుతున్నారు.