ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్టు 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. యుఎఇ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు అలీషన్‌(22), మహ్మద్‌ వసీమ్‌(19)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా అందరూ సింగల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా ముందు యుఎఇ 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.